Ajit Pawar: ఈ లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబధాల గురించి కాదని, ఇది ప్రధాని నరేంద్రమోడీకి రాముల్ గాంధీకి జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. పూణే జిల్లాలోని బారామతి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన భార్య సునేత్ర తరుపున శనివారం ప్రచారం చేశారు. కన్హేరిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అజిత్ పవార్, ఆ తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారానికి అజిత్ పవార్ కుమారులు పార్థ్, జై హాజరయ్యారు.
Read Also: Congress: కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు
దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిని కొన్ని స్థానాల్లో బారామతి ఉంది. ఇది గత కొంత కాలంగా ఎన్సీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఎన్సీపీ చీలిక తర్వాత ఈ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ పడటంతో దేశవ్యాప్తంగా ఈ స్థానం చర్చనీయాంశం అయింది.
ప్రచారంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. హనుమంతుడిని ప్రార్థించిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, ఎన్నికలు ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉండబోతున్నాయని అన్నారు. ఈ స్థానంలో సుప్రియా సూలేకి ఎన్సీపీ(శరద్ పవార్)-కాంగ్రెస్- శివసేన(ఉద్ధవ్) పార్టీలు మద్దతుగా నిలుస్తుండగా.. సునేత్రకి బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) మద్దతునిస్తున్నాయి. బారామతిలో మే 7న పోలింగ్ జరగబోతోంది.