ప్రముఖ నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్ పలు చిత్రాలలో బాలనటుడి పాత్రలు పోషించాడు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రౌడీ బాయ్స్’లో అతను ప్రతినాయకుడి తరహా పాత్రను పోషించి, మెప్పించాడు. ఇదిలా ఉంటే… విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన ‘వర్జిన్ స్టోరీ’ మూవీ ఈ నెల 18న జనం ముందుకు రాబోతోంది. ‘కొత్తగా రెక్కలొచ్చెనా అనేది దీని ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు.
Read Also : ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయని, ఇవన్నీ సినిమాపై పాజిటివ్ బజ్ ను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ’ని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ‘యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని, రొమాంటిక్ హీరోగా విక్రమ్ కు మంచి పేరొస్తుంద’ని దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతాన్ని అందించాడు.