తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్ను రాజమౌళి గ్రాండ్గా విడుదల చేశారు. విజువల్గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది.
ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్పై ట్రైలర్ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను దాటుకుంటూ మహేష్ బాబు ప్రయాణం చూపించారు. చివర్లో ఎద్దుపై త్రిశూలం పట్టుకుని రుద్ర అవతారంలో కనిపించిన మహేష్ ను చూసి అభిమానులు కేరింతలు వేశారు. ఆ వెంటనే టైటిల్ ‘వారణాసి’ డిస్ప్లే కావడంతో హాల్ మార్మోగిపోయింది.
ఇప్పటికే మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ను ప్రధాన విలన్ ‘కుంభ’గా, ప్రియాంక చోప్రాను హీరోయిన్ ‘మందాకిని’గా పరిచయం చేశారు. తాజగా మహేష్ బాబు పాత్రకు ‘రుద్ర’ అనే పేరు ఖరారైంది. ఈ చిత్రం 2027 సమ్మర్లో రిలీజ్ అవుతుందని అంతకుముందే కీరవాణి వెల్లడించారు.
“మేము కొత్తగా ఫిల్మ్డ్ ఫర్ IMAX టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి భారీ పవర్ అవసరం. నిన్న రాత్రి టెస్ట్ చేయాలని అనుకున్నాం కానీ కొందరు వచ్చి డ్రోన్ వీడియోలు తీసి నెట్లో పెట్టారు. లీక్ కాకూడదనే భయంతో డైరెక్ట్గా ఈరోజే స్క్రీనింగ్ పెట్టాం. పవర్ సరిపోక లేట్ అయింది. కొద్దిసేపు ఓపిక పట్టండి” అని రాజమౌళి చెప్పారు. తరువాత ట్రైలర్ను విజువల్ స్పెక్టకిల్గా ప్రదర్శించారు. ఆ తరువాత విడుదలచేసిన ట్రైలర్ మైమరిపించింది. ఈ సినిమాలో మహేష్ రాముడిగా కనిపించనున్నట్లు దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చాడు. అయితే.. రామాయణంలో ఒక భాగం ఈ సినిమా అని ఆయన వివరించారు.