Tollywood Ticket Prices: టాలీవుడ్లో సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో రెవెన్యూ పంపిణీ (పర్సెంటేజ్) విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ అంశాన్ని పరిశీలిస్తున్న పాత కమిటీని ఫిల్మ్ ఛాంబర్ పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ అధ్యక్షతన మొత్తం తొమ్మిది మంది సభ్యులతో కొత్త కమిటీని నియమించింది. పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరలు, థియేటర్లలో అమలవుతున్న పర్సెంటేజ్ విధానం వంటి కీలక అంశాలపై ఈ కమిటీ విస్తృతంగా చర్చించనుంది.
అయితే ఈ కమిటీ తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలనే విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి గడువు విధించలేదు. తొందరపాటు నిర్ణయాల కంటే అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి, పరిశ్రమకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పరిష్కారాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో సమయం తీసుకోవాలని కమిటీకి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల టికెట్ ధరలు, రెవెన్యూ షేరింగ్ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త కమిటీ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. కమిటీ సమర్పించే సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో టాలీవుడ్లో టికెట్ ధరలు, పర్సెంటేజ్ విధానానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు రూపొందే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

