‘మనిషికి పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్నారు పెద్దలు. అన్న పెద్దవారు పురుషాధిక్య ప్రపంచంలోని జీవులు కాబట్టి, ఆ మాటను మగాడికే అన్వయిస్తూ అలా నుడివారు. కానీ, పట్టుదల ఉన్న మహిళలు కూడా అనుకున్న రంగంలో అలరించగలరని, అందునా గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు నిరూపించారు. అలాంటి వారిలో దర్శకురాలు, రచయిత నందినీ రెడ్డి కూడా చోటు సంపాదించారు. వేళ్ళ మీద లెక్కపెట్టదగ్గ చిత్రాలే తీసినా, నందినీరెడ్డి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి, అందుకు తగ్గ రీతిలో సినిమాలు రూపొందించడంలో తనదైన బాణీ పలికిస్తున్నారామె.
నందినీ రెడ్డి 1980 మార్చి 4న హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ వి. రెడ్డి, తల్లి రూపారెడ్డి వరంగల్ కు చెందినవారు. చిన్నప్పటి నుంచీ చురుకైన నందినికి ఆమె కన్నవారు స్వేచ్ఛనిచ్చారు. సికిందరాబాద్ సెయింట్ యాన్స్ స్కూల్ లో చదివిన నందిని, కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చదివారు. న్యూ ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో ఎమ్.ఏ. పొలిటికల్ సైన్స్ చేశారు. మొదటి నుంచీ సినిమాలపట్ల ఆసక్తి పెంచుకున్న నందిని 16 ఏళ్ళ వయసులోనే నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజును కలిశారు. ఆయన తెరకెక్కించిన ‘లిటిల్ సోల్జర్స్’కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్-డైరెక్టర్ రసూల్ ఆమెలోని ఉత్సాహం చూసి, కృష్ణవంశీకి పరిచయం చేయగా, మొదట్లో ఆయన తన వద్ద ఖాళీ లేదన్నారు. తరువాత రమ్యకృష్ణ కూడా నందినిలోని చలాకీతనం చూసి ముచ్చటపడి, కృష్ణవంశీకి సిఫార్స్ చేశారు. అలా వంశీ దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశారామె. సురేశ్ ప్రొడక్షన్స్ లోనూ కొన్ని సినిమాలకు అసోసియేట్ గా ఉన్నారామె. ‘అలా మొదలైంది’ కథ రూపొందించుకొని, మెగాఫోన్ పట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ ఆమెకు తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. నాని, నిత్యమీనన్ నటించిన ‘అలా మొదలైంది’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే దర్శకురాలిగా నందినీ రెడ్డికి మంచి పేరు లభించింది.
అవకాశాలు తలుపు తట్టినా, ఆచి తూచి అడుగేయాలనే నందిని నిర్ణయించారు. రెండేళ్ళ తరువాత సమంత, సిద్ధార్థ్ తో ‘జబర్దస్త్’ అనే చిత్రం తెరకెక్కించారు. మరో మూడేళ్ళకు ‘కళ్యాణ వైభోగమే’, తరువాత సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ చిత్రాలు రూపొందించారు నందిని. ఆమె మరికొందరు దర్శకులతో కలసి తీసిన వెబ్ సిరీస్ ‘పిట్టకథలు’ సైతం ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారామె. కొన్ని టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారామె. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ‘గ్యాంగ్ స్టర్స్’ అనే చిత్రాన్నీ తెరకెక్కించారు. ‘ఆహా’ ఓటీటీ కోసం సమంతతో శ్యామ్ జామ్ అనే కార్యక్రమాన్నీ రూపొందించారు. రాబోయే ‘అన్నీ మంచి శకునములే’ తరువాత మరో చిత్రం కూడా నందిని దర్శకత్వంలో రూపొందనుంది. మరి ఈ సినిమాలతో నందిని ఏ తీరున మురిపిస్తారో చూడాలి.