బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు మార్చ్ 11 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది.
ఇక కలెక్షన్ల పరంగానే కాకుండా మరోవిధంగా కూడా ఈ సినిమా చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అది ఏంటంటే.. సాధారణంగా సాధువులు.. నిత్యం ధ్యానంలో ఉంటారు. దేవుడిని స్మరిస్తూ ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటారు. వారి బయట ప్రపంచం గురించి పట్టింపు ఉండదు.. అయితే చరిత్రలో మొట్టమొదటిసారి సాధువులు థియేటర్ల బాట పట్టారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను సాధువులు వీక్షించారు. ప్రస్తుతం సాధువులు సినిమా వీక్షించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సాధువులు మొదటిసారి థియేటర్ కి వచ్చి సినిమా చూడడం.. ఈ సినిమా చేసుకున్న అదృష్టం.. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా కాదు.. ఒక విప్లవం అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ఈ ఫోటోను వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేయడం విశేషం. ఈ సినిమాపై వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ ని వివేక్ వుడ్ గా మారుస్తున్నానని, కమర్షియల్ గా విజయం సాధించడం కంటే కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ రావడం అనేది ఎంతో గొప్ప విజయం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2022