గ్లామర్ కోసమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును వెలిగించేందుకు నటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి నేతృత్వంలోని **‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 అత్యంత వైభవంగా జరిగింది. హెచ్ఐసీసీలో జరిగిన ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు హాజరయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి లక్ష్మీ మంచు సంకల్పాన్ని అభినందించారు.
Also Read :Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
ఈ వేడుకలో సినిమా తారలు ఒక గొప్ప ఆశయం కోసం ర్యాంప్ వాక్ చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్జ్ రూపకల్పన చేసిన అద్భుతమైన దుస్తుల్లో తారలు మెరిసిపోయారు. లక్ష్మీ మంచుతో పాటు పాయల్ రాజ్పుట్, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, హేబ్బా పటేల్, ప్రియదర్శి, నిఖిల్ విజయేంద్ర సింహ, శివ కందుకూరి వంటి యువ తారలు, జయప్రద, సుహాసిని వంటి సీనియర్ నటీమణులు ఈ ప్రదర్శనలో భాగస్వాములై సందడి చేశారు. ఈ క్రమంలో లక్ష్మీ మంచు మాట్లాడుతూ “ప్రతి బిడ్డకు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలే సామాజిక మార్పుకు పునాదులు. ఈ నిధుల సేకరణ కార్యక్రమం ద్వారా మేము సేకరించే ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు,” అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.