లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. 66 ఏళ్ల గీత రచయిత ఆకస్మిక మరణ వార్త తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల 1984లో జననీ జన్మభూమితో అరంగేట్రం చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున..’ పాటతో కీర్తిని పొందారు. శాస్త్రి దాదాపు 3000 పాటలకు సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Read Also : ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం… సినీ ప్రముఖుల కన్నీటి నివాళి
తాజాగా ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవదేహం అభిమానుల సందర్శనార్థం ఉంచగా, అక్కడికి సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పార్థీవదేహం వద్ద తనికెళ్ళ భరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. “సీతారామశాస్త్రీ నాకు అన్నయ్య. నాకన్నా రెండు నెలలే పెద్ద. ఆయనకు సాహిత్యం అంటే ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2 గంటలకు కూడా లేచి పాడేవారు. ఇండస్ట్రీలో ఈ శూన్యాన్ని పూరించడం కష్టం. ప్రతి పదాన్ని చెక్కేవారు. వజ్రం పొడిగినట్టు. అందుకే ఆయన పాటల ప్రకాశం తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకూ ఉంటుంది” అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.