సురేఖ వాణి – సుప్రీత.. ఈ తల్లీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు, స్నేహితుల్లా కలిసి ఉంటూ, సోషల్ మీడియాలో సందడి చేసే వీరిద్దరి రిలేషన్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా తన తల్లి పెళ్లి విషయంలో సుప్రీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ తెలిసిందే. భర్త మరణం తర్వాత తన కూతురే ప్రపంచంగా బతుకుతున్న సురేఖ కోసం, సుప్రీత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సుప్రీత మనసులోని మాట వింటే ఆమెకు తన తల్లిపై ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది. “నేను పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లేముందే, నా తల్లి జీవితంలో ఒక తోడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆమెను అమితంగా ప్రేమించే, గౌరవించే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. ఈ విషయంపై ఇప్పటికే నేను మా బంధువులతో కూడా చర్చించాను, వారందరూ కూడా నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు” అని సుప్రీత చెప్పుకొచ్చింది.
Also Read :Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
అమ్మ రెండో పెళ్లి గురించి సుప్రీత ఆలోచిస్తున్నప్పటికీ, అది కేవలం తన ఇష్టం మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది. “అమ్మ సంతోషమే నాకు ముఖ్యం. తన నిర్ణయమే తుది నిర్ణయం. నాన్న ఉన్న స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి అమ్మ ఇష్టపడటం లేదు. ఆమె భావాలను నేను గౌరవిస్తాను. తనకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను. కానీ, జీవితాంతం అమ్మ ఒంటరిగా ఉండకూడదనేదే నా తపన” అని ఆవేదనతో కూడిన ప్రేమను వ్యక్తపరిచింది. నేటి కాలంలో కూడా వితంతువుల రెండో పెళ్లిపై సమాజంలో కొన్ని అపోహలు, విమర్శలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి, తన తల్లి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సుప్రీత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లికి ఒక మంచి తోడును వెతకాలనే ఒక కూతురి ఆలోచన నిజంగా అభినందనీయం.