మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్తో ‘వేదాళం’ రీమేక్ లైన్లో ఉన్నాయి.
అయితే తాజాగా చిరు మరో తమిళ రీమేక్లో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ ఈ సినిమాను తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే సినిమాను చిరు తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఈ రీమేక్ను సుజిత్ తెరకెక్కించబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో చాలా మందికి చేరువైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో భారీ మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!