కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కలయికలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది ‘స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ ప్రెస్ మీట్లో పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాజెక్ట్ను ముందుకు నడిపించిన విజయ్ సేతుపతి (సేతు సార్)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ సేతుపతి లాంటి అపారమైన నటన సామర్థ్యం ఉన్న స్టార్ హీరో.. ఇలాంటి ఒక వైవిధ్యమైన మిస్టరీ కథను నమ్మి సైన్ చేయడం తాము నమ్మలేకపోయామని ఎమోషనల్ అయ్యారు.
విజయ్ సేతుపతి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. “సేతు సార్ సింప్లిసిటీ చూసి నేను షాక్ అయ్యాను. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్స్ పైకి వస్తే ఒక కొత్త నటుడిలా ఎంతో వినయంగా ఉంటారు. మీరు గమనిస్తే.. ఆయన నటనలో గానీ, సినిమాలో ఒక్క ఫ్రేమ్లో గానీ ఎక్కడా ‘అహంకారం’ కనిపించదు. ఈ క్వాలిటీ నిజంగా ఇన్స్పైరింగ్. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక పవర్ఫుల్ మరియు డిఫరెంట్ విజయ్ సేతుపతిని చూస్తారు” అని కొనియాడారు. సినిమా కథాంశం గురించి పూరీ సంచలన విషయాలు బయటపెట్టారు.
“ఈ ‘స్లమ్డాగ్’ సినిమా పూర్తిగా మన చుట్టూ జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాధారణంగా మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు భిక్షాటన చేసే వారిని చూసి చూడనట్లు వదిలేస్తాం, వారిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం. కానీ, అసలు ఆ బిచ్చగాళ్లు ఎవరు? వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వారి వెనుక ఎన్ని గుండెకోతలు, ఎంత పెద్ద కథలు, ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో ఆ పాయింట్ను పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో, గుండెల్ని పిండేసే ఎమోషన్స్తో చూపించబోతున్నాం” అని క్లారిటీ ఇచ్చారు. కన్నడ సూపర్ స్టార్ విజయ్ కుమార్ దునియా ఈ సినిమాలో మెయిన్ విలన్ (Bad Guy) పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ నటి జరీనా వహాబ్ తల్లి పాత్రలో నటించగా.. ఆమె పండించిన ఎమోషన్స్ చూసి సెట్లోనే కన్నీళ్లు వచ్చాయని దర్శకుడు తెలిపారు. వీరితో పాటు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ, రోహన్, ముఠా రాజేంద్రన్, గణేష్ కీలక పాత్రలు పోషించారు.

