‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు.
Also Read:Tollywood : పవర్ ఫుల్ క్యారెక్టర్స్తో వస్తున్న సీనియర్ హీరోలు
ఎంతో అమాయకంగా, సాంప్రదాయబద్ధంగా జీవించే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని విచిత్రమైన, ఊహించని నేరాల్లో ఎలా ఇరుక్కుంది..? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి..? అనే ఆసక్తికరమైన పాయింట్తో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథను నడిపించినట్లు అర్థమవుతోంది. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్కు రంజిన్ రాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ప్రిన్స్, అలీ, ధన్రాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, మాస్టర్ రోహన్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ కామెడీ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.