శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘పాటలు, టీజర్ చూశాక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకంటున్నా. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాలసహకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. అలా ఈ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’ అన్నారు.
దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ ‘కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రేమించడం కాదు…ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్నఅంశాన్ని చూపిస్తున్నాం. త్వరలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం’ అని చెప్పారు.
నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ ‘దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్, మహేందర్ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.