ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఒమిక్రాన్ దెబ్బకు వాయిదా దారి పట్టాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా .. ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’ పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ మేకర్స్ బల్లగుద్ది చెప్తున్నా.. అభిమానుల మనస్సులో మాత్రం వాయిదా పడింది అనే అనుమానం మాత్రం పోలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటివరకు రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు.. ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడిందని సోషల్ మీడియా లో టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
“సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా – మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడే వక్షాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ డైరెక్ట్ గా ‘రాధేశ్యామ్’ వాయిదా పడుతోందని మేకర్స్ తెలుపుతున్నట్లుగా ఉంది ఆ ట్వీట్.. ఇక ఇదే విషయాన్నీ డైరెక్టర్ ని అడుగుగా.. అలాంటిదేమైనా ఉంటె ఖచ్చితంగా ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చాడే తప్ప కన్ఫర్మ్ గా వస్తున్నాం అని చెప్పకపోవడంతో మరోసారి అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. ఒక పక్క ప్రమోషన్లు చేయక.. ఇంకోపక్క వాయిదా కూడా వేయకుండ ఉండడంతో అభిమానులు అయోమయంలో పడుతున్నారు. మరి మేకర్స్ ఈ విషయమై క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
— Radhaa Krishna (@director_radhaa) January 4, 2022