మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుదల కాబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్ కి లాగే గాయత్రీ భరద్వాజ్ కి కూడా ఇది మొదటి సినిమా. సినిమాలో ఇద్దరు హీరోయిన్ల కూ నటించేందుకు మంచి స్కోప్ ఉంటుందని దర్శకుడు వంశీ చెబుతున్నారు.
గాయత్రీ భరద్వాజ్ ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018 గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిల్స్ కూడా గెలుచుకుంది. వెబ్ సిరీస్ ‘దిండోరా’ లో నటనకు గానూ గాయత్రి ప్రశంసలు అందుకుంది.
స్టూవర్ట్ పురంలో పేరుమోసిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ రవితేజ చిత్రాల్లో కెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇదే రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.