ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారని అన్నారు. తెలుగుజాతిలో ఎన్టీఆర్ పుట్టడం మన అదృష్టమని అన్నారు. కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎక్కడి స్థానికులకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 610 జీవోను తీసుకొచ్చారని, ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగులు స్థానికతపై ఆందోళన చేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
Read: ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో బాలయ్య, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గోన్నారు. ఇక ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానికులకు అన్యాయం జరుగుతుందని వారు అందోళన చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై బాలయ్య పై విధంగా స్పందించారు.