Sasana Sabha: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఈ మూవీలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న గ్రాండ్గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్ను ఏపీ మంత్రి రోజా ఆవిష్కరించారు. అటు కన్నడ ట్రైలర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్ను దర్శకుడు, నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్ను ‘నాంది’ సతీష్ విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ సాంగ్ను వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు.
తెలుగు ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మంత్రి రోజా మాట్లాడారు. ‘శాసనసభ అనే టైటిల్ వినగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమాలలో పొలిటికల్ సీన్స్ వచ్చినప్పుడు శాసనసభని చూపిస్తారు. కానీ ఈ సినిమాకే ‘శాసనసభ’ అని టైటిల్ పెట్టడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను కూడా సినిమా నుంచే పాలిటిక్స్కి వచ్చాను. ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఇలా పొలిటికల్ సినిమా ఈవెంట్కు పిలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ వేడుకకు రావడానికి రెండు కారణాలు. ఒకటి కెజియఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్. కెజియఫ్ సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం మళ్లీ మళ్లీ ఆ సినిమాని చూడాలనిపించేలా చేస్తుంది. మ్యూజిక్కే ఆ సినిమాకి హీరోలాగా ఉంటుంది. మరొకరు మా షణ్ముగం. దాదాపు 13 సంవత్సరాలుగా అతను తెలుసు. నాకో బ్రదర్ లాంటివాడు. మీరు వస్తేనే ట్రైలర్ విడుదల చేస్తానని అనడంతో.. అంత అభిమానం, ప్రేమకి లొంగిపోయాను. శాసనసభలో ప్రస్తుతం సినిమా తరహా సీన్లే కనిపిస్తున్నాయి. ఏ లాంగ్వేజ్లో ట్రైలర్ చూసినా సేమ్ ఇంపాక్ట్ కలగడానికి అదే కారణం. ఇందులో మంచి మంచి ఆర్టిస్ట్లు ఉన్నారు. మా అందరికీ లక్కీ హీరో రాజేంద్ర ప్రసాద్గారు. ఆయనతో మొదటి సినిమా చేసిన వాళ్లందరం కూడా మంచి హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నాం. ఆయన ఎంత మంచి నటుడో అందరికీ తెలుసు. అలాంటి నటుడు ఒక మెయిన్ లీడ్లో.. కంటతడి పెట్టించబోతున్నారు. హీరో ఇంద్రసేనని చూసి సడెన్గా కేజీఎఫ్ హీరో వచ్చాడేమో అనుకున్నాను. చాలా చక్కగా ఇందులో ఆయన నటించారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజ్ కూడా ఇందులో చక్కగా కనిపిస్తున్నారు. సోనియా అగర్వాల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా ట్రైలర్తో అర్థమైంది. హెబ్బా పటేల్ పబ్ సాంగ్లో కనిపించింది’ అని మంత్రి రోజా వెల్లడించారు.
అటు ఓటు గురించి మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ట్రైలర్లో రెండు డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. వీటి గురించి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలి. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధపడేకన్నా.. మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాళ్లకి మంచి జరుగుతుంది. కాబట్టి కులం, మతం, ప్రాంతం అనేది పక్కన పెట్టండి. మీ ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు.. వారిలో ఎవరు బెస్ట్? ఎవరికి మనం ఓటేస్తే మంచి చేస్తారు అనే ఆలోచనతో.. ప్రతి ఒక్కరినీ ఓటేయమని కోరుకుంటున్నాను. రెండోది.. ‘ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా.. ఆ తర్వాత 5 ఇయర్స్ మనమే రాజురా’ అంటారు. ఆ రోజులు పోయాయ్.. ఓటేసిన రోజు నుంచి.. మళ్లీ ఓటు వేసే రోజు వరకు ఎమ్మేల్యేలకి, ఎమ్పిలకి గడపగడపకి వెళ్లి.. మీకు ఏం ఇచ్చారు.. ప్రభుత్వం ఇచ్చినవన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడమే కాకుండా.. ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రతి రోజు తిరుగుతున్నామంటే.. ఇంతకు ముందులా పరిస్థితులు లేవని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మార్పు వచ్చింది.. దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి. సినిమా పరంగా ఈ రోజు మంచి ప్రొడ్యూసర్ దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది సినిమాలో నటించడానికి వెళ్లి, కంటెంట్ నచ్చి.. సినిమానే నిర్మించిన సప్పాని బ్రదర్స్కి కంగ్రాట్స్. డిసెంబర్ 16న వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.
దర్శకుడు, నటుడు అనిష్ కురివిల్లా మాట్లాడుతూ.. శాసనసభ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. ఇలా ఉంటుందని తాను ఊహించలేదని.. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అన్నారు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తన కెరీర్లోనే చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఈ పాత్ర చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానని.. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తాడు? ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు? వంటివన్నీ తన పాత్రలో ఉంటాయన్నారు. ఈ మూవీ ఎంటర్టైనింగ్ పొలిటికల్ థ్రిల్లర్ అని.. ప్రేక్షకులందరూ ఈ సినిమాతో ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 16వ తేదీని అందరూ మార్క్ చేసి పెట్టుకోవాలన్నారు. చిత్ర దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ.. ‘ముందుగా ఈ వేడుకకు వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన రోజా గారికి, ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం. నేను ఈ సినిమా చేయడానికి కారణమైన సురేష్ వర్మగారు, చిన్నికృష్ణగారికి స్పెషల్ థ్యాంక్స్. రాఘవేంద్ర రెడ్డిగారి దగ్గర ఉన్న కథకి నన్ను వాళ్లు సజెస్ట్ చేశారు. నా మొదటి సినిమాకి అచ్చు రాజమణి పనిచేశారు. రెండో సినిమాకి ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తానని ఊహించలేదు. ఇంద్రసేన యాక్షన్ హీరోగా ఇందులో కనిపిస్తారు. ఆయనకి ఈ సినిమా చాలా మంచి పేరుని తీసుకువస్తుంది. మంచి యాక్షన్ హీరో అవుతాడు. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లారు. ఈ సినిమా విడుదల తర్వాత ‘శాసనసభ’లో జరిగేదాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. రాజేంద్రప్రసాద్గారి పాత్ర సినిమాకి హైలెట్గా ఉంటుంది. నారాయణస్వామిగా ఆయన ఇందులో చేశారు. ‘ఆ నలుగురు’ సినిమా తర్వాత ఆయనకి మళ్లీ అలాంటి పేరుని తీసుకువచ్చే పాత్రని ఇందులో చేశారు. మంచి సినిమా ఇది.. ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.