‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు. ఎన్ని కథలు, కవితలు పొంగిపొరలినా, వాటికి నటన కూడా తోడయినప్పుడే రక్తి కడుతుందని పెద్దల మాట! ఇప్పటికీ నాటకం దేశవిదేశాల్లో సందడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగునాట సైతం నాటకాన్ని బతికించే ప్రయత్నంలో కొందరు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ‘సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్’ నాటకానికి వైభవం తీసుకువచ్చే దిశగా పయనిస్తోంది.
ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులు. విక్టరీ వెంకటరెడ్డి ఈ సంస్థ కన్వీనర్. వచ్చే యేడాది ఉగాది నాటకోత్సవాలు నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ప్రథమ ఉత్తమ ప్రదర్శనకు రూ.3 లక్షలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2 లక్షలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్టు భరణి తెలిపారు. మన దేశంలో ఇంత పెద్ద మొత్తంలో నాటకాలకు బహుమతి ఇవ్వడం ఇప్పుడేనని కన్వీనర్ చెప్పారు. మరి ఈ ప్రోత్సాహంతో ఎన్ని నాటకాలు, ఎంతమంది కళాకారులు వెలుగు చూస్తారో చూడాలి.