సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్గా నిలిచింది.
Read Also : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
ఈ డాక్యుమెంటరీకి రింటూ థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించారు. దళిత స్త్రీలు నడుపుతున్న భారతదేశంలోని ఏకైక వార్తాపత్రిక గురించి ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. చీఫ్ రిపోర్టర్ మీరా, ఆమె జర్నలిస్టులు సంప్రదాయాలను వీడి, శక్తివంతంగా ఉండటం అంటే ఏమిటో పునర్నిర్వచించారు. ‘రైటింగ్ విత్ ఫైర్’ కథనం ప్రింట్ నుండి డిజిటల్ మీడియా వరకు వార్తాపత్రిక ప్రయాణాన్ని, దాన్ని నడిపిన మహిళా జర్నలిస్టుల కథనాన్ని తెలియజేస్తుంది. గత సంవత్సరం ఈ చిత్రం సన్ డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు సంపాదించింది. ఇప్పటికే ఈ సినిమా 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను మూటకట్టుకుంది. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంతో ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ పైనే ఇండియా ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో లేదో చూడాలి.