మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ పోస్టర్ లో రవితేజను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వారి ముఖాల్లో ఆనందాన్ని మనం చూడవచ్చు. కేవలం పోస్టర్ కారణంగానే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈరోజు ఉదయం నుంచి ట్విట్టర్ లో ట్రెండింగ్ ఉండడం విశేషం.
ఇతరులకు ఆనందాన్ని అందించడం నిజమైన సంతృప్తిని ఇస్తుంది. మాస్ మహారాజా రవితేజ ఈ పోస్టర్ ద్వారా సినిమాలో తన నిజమైన పాత్రను చూపించాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న వెండి తెరపైకి రానుంది.