(అక్టోబర్ 9న దర్శకుడు వినాయక్ పుట్టినరోజు)
‘వి’ ఫర్ ‘విక్టరీ’ అంటారు. అలాంటి మూడు ‘వి’లను పేరులో పెట్టుకున్న వి.వి.వినాయక్ కు ‘విక్టరీ’ ఆరంభంలోనే తలుపు తట్టింది. అప్పటి నుంచీ మొన్నటి దాకా అనేక చిత్రాలతో జైత్రయాత్ర చేశారు వినాయక్. అన్ని వర్గాలను అలరించే అంశాలతో తన సినిమాలను రూపొందించే ప్రయత్నం చేస్తూంటారు వినాయక్. అందుకు తగ్గట్టుగానే అనేక సార్లు ఫలితం రాబట్టారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో చాలామందితో ఘనవిజయాలను చవిచూశారు వినాయక్. ఇప్పటికీ అదే ప్రయత్నంలోనే సాగుతున్నారాయన.
వినాయక్ పూర్తి పూరు గండ్రోతు వీర వెంకట వినాయక రావు. అందరూ అభినామంగా ‘వినయ్’ అని పిలిచేవారు. చిన్నప్పుడు చిరంజీవి యాక్షన్ మూవీస్ చూసి, సినిమాలపై అభిమానం పెంచుకున్నారు వినయ్. ఎలాగైనా చిత్రసీమలో తనదైన బాణీ పలికించాలన్న అభిలాషతో బయలు దేరారు. ఆరంభంలో కొంతమంది దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వినయ్, తరువాత డైరెక్టర్ సాగర్ తెరకెక్కించిన సినిమాలకు కో-డైరెక్టర్ గా ఉన్నారు. ప్రేక్షకులు కోరుకొనేది మనం అందిస్తే చాలు, విజయం తథ్యం అనే సూత్రాన్ని వినాయక్ బాగా నమ్ముతారు. అప్పట్లో ‘సమరసింహారెడ్డి’ ఘనవిజయంతో తెలుగునాట ఫ్యాక్షన్ డ్రామాలకు భలే క్రేజ్ ఉండేది. దాంతో వినయ్ సైతం అదే రూటులో సాగుతూ తొలి ప్రయత్నంలోనే ఫ్యాక్షన్ డ్రామాను ఎంచుకొని ‘ఆది’ తెరకెక్కించారు. జూ.యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘ఆది’ చిత్రం అనూహ్య విజయం సాధించింది. వెంటనే బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’లో అదే సూత్రం పాటించారు. అయితే అప్పటికే ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంగా చూపిన చిత్రాలలో బాలకృష్ణ నటించేసి ఉండడంతో ‘చెన్నకేశవ రెడ్డి’ ఆ స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. తన మూడవ చిత్రం ‘దిల్’తో యువకుల మదిని జిల్ మనిపించారు వినయ్. ఆ సినిమా నిర్మాత ‘దిల్’నే ఇంటిపేరుగా మార్చుకొని నేడు దిల్ రాజుగా చిత్రసీమలో సాగుతున్నారు. ఇక వినయ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘ఠాగూర్’. చిరంజీవితో వినయ్ తీసిన ఈ తొలి చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే ఈ నాటికీ బిగ్ హిట్ గా నిలచింది.
తన తొలి హీరో జూనియర్ యన్టీఆర్ తో “సాంబ, అదుర్స్” వంటి చిత్రాలను రూపొందించారు వినాయక్. వీటిలో ‘అదుర్స్’ ఈ నాటికీ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంది. బుల్లితెరపై ‘అదుర్స్’ వస్తోందంటే చాలు ప్రేక్షకులు కళ్ళప్పగించి టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. వెంకటేశ్ హీరోగా వినాయక్ రూపొందించిన ‘లక్ష్మీ’ బంపర్ హిట్ అయింది. రవితేజతో వినయ్ తెరకెక్కించిన ‘కృష్ణ’ జనాన్ని ఆకట్టుకుంది. రామ్ చరణ్ తో వినాయక్ తీసిన ‘నాయక్’ విజయకేతనం ఎగరేసింది. ఇక అల్లు అర్జున్ తో “బన్నీ, బద్రీనాథ్” రూపొందించారు. ప్రభాస్ తో ‘యోగి’, సాయిధరమ్ తేజ్ తో ‘ఇంటెలిజెంట్’ తీశారు. వినాయక్ తొలి చిత్రం ‘ఆది’ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కు, వినయ్ అంటే మంచి గురి. అందువల్ల తన తనయుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయంచేస్తూ వినాయక్ డైరెక్షన్ లోనే ‘అల్లుడు శీను’ నిర్మించారు. ఈ చిత్రంతో సాయి శ్రీనివాస్ హీరోగా మంచి మార్కులే సంపాదించాడు. ఇక అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘అఖిల్’కు కూడా వినయ్ దర్శకుడు.
చిరంజీవి రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన కెరీర్ లోనే బిగ్ హిట్ గా ‘ఠాగూర్’ను నిలిపారు వినాయక్. ఆ నమ్మకంతోనే చిరంజీవి రీ ఎంట్రీగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 150’కి వినాయక్ ను దర్శకునిగా ఎన్నుకున్నారు. చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కూడా మంచివిజయం సాధించింది. యన్టీఆర్ తో తొలి చిత్రం రూపొందించి విజయం సాధించిన రాజమౌళి, అదే తారక్ తో తన మొదటి సినిమా తెరకెక్కించి సక్సెస్ సొంతం చేసుకున్న వినాయక్ ఒకప్పుడు పోటాపోటీగా సాగారు. ఇప్పుడు తన ‘అల్లుడు శీను’ హీరో సాయి శ్రీనివాస్ ను హిందీ రంగంలో పరిచయం చేస్తూ, రాజమౌళి ‘ఛత్రపతి’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు వినయ్. మరి తొలి తెలుగు చిత్రంతో విజయం సాధించిన వినాయక్, మొదటి హిందీ సినిమాతోనూ అదే మ్యాజిక్ చేస్తారేమో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సారి వినాయక్ ఏ తీరున అలరిస్తారో చూడాలి.