Guntur Kaaram is a huge commercial success says producer Naga Vamsi: ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌద కథానాయికలుగా నటించారు. ఎస్. థమన్ సంగీతం అందించగా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించిన నేపథ్యంలో తాజాగా నిర్మాత ఎస్. నాగ వంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
నిర్మాత ఎస్. నాగ వంశీ మాట్లాడుతూ.. “మా గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టిందని తెలుపుదాం అనుకుని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొందరు మీడియా వారు ఎందుకో ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేమించారు అందుకే డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఫోన్ చేసి కూడా కలెక్షన్ల గురించి ఆరా తీశారు. అయితే ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యారు. సినిమాకు ఇంత మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించానని అన్నారు.
ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ రివ్యూలు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. విడుదలైన రోజు ఉదయం కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారు కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలు పెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.
సినిమాకి మొదట వచ్చిన టాక్ పై మీ అభిప్రాయం?
కొందరు కావాలనే టార్గెట్ చేశారనే అభిప్రాయాలున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట షోలు చేయడం వల్ల కూడా కాస్త మిస్ లీడ్ అయ్యారని అనిపించింది. దీనిని ఫ్యామిలీ సినిమాగా ముందు మేము ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లలేదు. ‘గుంటూరు కారం’ని పక్కా మాస్ ఫిల్మ్ అనుకొని, అభిమానులు ఏమైనా కాస్త నిరాశ చెందారేమో అనిపించింది. ఇప్పుడు సినిమా పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా సినిమాని ఈ స్థాయి వసూళ్లతో ఆదరిస్తూ, బయ్యర్లను నిలబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణం సంక్రాంతి పండుగ అనుకోవచ్చా?
గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చింది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండుగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.
మహేష్ బాబు స్పందన ఏంటి?
మహేష్ బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదటి రోజు కొందరు నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా మహేష్ బాబు ఏమాత్రం ఆందోళన చెందలేదు. రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనా నిజమైంది. ఆయన ధైర్యం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైంది అనిపించింది. ఇది మాస్ సినిమా అని అందరూ భావించారు. త్రివిక్రమ్ శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. కేవలం ఒక ఏరియా వసూళ్లను చూసి సినిమా ఫలితాన్ని నిర్ణయించలేం. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది.