టాలీవుడ్ లో కథానాయికల కొరత ఉంది. అందుకే చేసిన హీరోయిన్ తో మళ్ళీ చేస్తూ వస్తున్నారు మన స్టార్ హీరోలు. అందుకే మహేశ్ ఈ సారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో ఇప్పటి వరకూ మహేశ్ తో నటించని హీరోయిన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కరిష్మా ఉన్న కథానాయికలంటే పూజా హేగ్డే, రశ్మిక మాత్రమే. కియారా రెండు సినిమాల్లో నటించి బాలీవుడ్ వైపు పరుగులు పెట్టింది. ఇక కృతి శెట్టిపై ఇంకా స్టార్ హీరోల కన్ను పడలేదు. దీంతో మన స్టార్ హీరోలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. అలా మహేశ్ కోసం అతిలోకసుందరి తనయను రంగంలోకి దించబోతున్నారట. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. ఇప్పుడు వారి వారసులు కలసి సినిమాలో నటిస్తే అది తప్పకుండా సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందనే చెప్పాలి. అందుకే జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మహేశ్, త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ భావిస్తోంది. గతంలో కూడా జాన్వీని తెలుగులో నటింప చేయాలని పలువురు ప్రయత్నించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మహేశ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ భావన. బాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూనే వస్తోంది. మరి జాన్వీ తెలుగు లాంఛింగ్ లాంఛన ప్రాయం అవుతుందా? లేక గుసగుసలకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.