సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈరోజు పద్మాలయ స్టూడియోస్లో పలువురు ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో రమేష్ బాబు పార్థివ దేహానికి జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపినాథ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు నివాళులు అర్పించారు. సుధీర్ బాబు కూడా అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం ఆచారాల ప్రకారం అంత్యక్రియల కార్యక్రమం మొదలైంది. మరి కాసేపట్లో మహా ప్రస్థానానికి రమేష్ బాబు పార్ధీవదేహం తీసుకెళ్లనున్నారు. అయితే మహమ్మారి కారణంగా మహేష్ బాబు సోదరుడి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడం బాధాకరం.
Read Also : రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?
రమేష్ బాబు 1974లో ‘అల్లూరి సీతారామ రాజు’తో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆయన 1997లో సినిమాల నుంచి రిటైర్ కావడానికి ముందు 15 చిత్రాలకు పైగా నటించాడు. తర్వాత తన సోదరుడు మహేష్ బాబు నటించిన ‘అర్జున్’, ‘అతిధి’ వంటి చిత్రాలకు నిర్మాతగా మారాడు. రమేష్ బాబు… కృష్ణ, ఇందిరాదేవికి మొదటి సంతానం. ఆయనకు మహేష్ తో పాటు ముగ్గురు చెల్లెళ్లు కూడా ఉన్నారు.
ఘట్టమనేని కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేసారు.