తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (TGFA) – 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్గా ప్రముఖ సినీ నిర్మాత , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (I&PR) జీవో నంబర్ 236ను విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న విడుదల చేసిన మునుపటి ఉత్తర్వులకు (G.O.Rt. No.166) సవరణగా ఈ కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించింది. సినీ రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ముఖ్యంగా ‘స్పెషల్ అవార్డ్స్’ కేటగిరీలో విజేతలను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించనుంది. తమ్మారెడ్డి భరద్వాజకు సినీ పరిశ్రమపై ఉన్న అపారమైన అవగాహన, అనుభవం ఈ ఎంపిక ప్రక్రియకు మరింత వన్నె తెస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.
Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..