Dhurandhar 2: ‘‘ధురంధర్’’ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. పాకిస్తాన్లో ఇండియన్ స్పై డ్రామాగా తెరకెక్కిన ధురంధర బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. నిషేధం విధించినప్పటికీ పాకిస్తాన్ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారు. అయితే, ఇప్పుడు ‘‘ధురంధర్-2’’ మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాలో యూరప్ దేశమైన ఫిన్లాండ్ దేశాధినేత ఉండటం గమనార్హం. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రస్తుతం రణవీర్ సింగ్ బ్లాక్బస్టర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. తన కొడుకు సలహా మేరకు భారత్ రాకముందే ఈ సినిమా చూశానిని, ఇప్పుడు దాని సీక్వెల్ ‘‘ధురంధర్-2: ది రివెంజ్’’ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
మార్చి 4 నుండి 7 వరకు భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉన్న అలెగ్జాండర్ స్టబ్ మాట్లాడుతూ.. తన కొడుకు ఈ సినిమా చూడాలని పట్టుబట్టారని అన్నారు. “భారతదేశానికి రాకముందు, నా కొడుకు నన్ను ‘ధురంధర్’ చూడమని అడగడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. నేను సినిమా చూశాను. ఉగ్రవాదంపై పోరాటం గురించి దాని కథను పూర్తిగా ఇష్టపడ్డాను. ఇప్పుడు మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ మార్చి 7న రిలీజ్ అయింది. మరోసారి రణ్వీర్ సింగ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. ‘‘జస్కిరత్ సింగ్ రంగి’’ పాత్రలో రణవీర్ నట విధ్వంసాన్ని చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. రణ్వీర్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.