Fifteen years For Yamadonga : తాతకు తగ్గ మనవడు ‘యమదొంగ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fifteen years For Yamadonga : తొలి నుంచీ తన తాత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావుకు అసలు సిసలు మనవడిని అనిపించుకోవాలని జూనియర్ యన్టీఆర్ తపించారు. అందుకు తగ్గట్టుగానే జూ.యన్టీఆర్ తో చిత్రాలు తెరకెక్కించిన దర్శకనిర్మాతలు సైతం కథలు, సన్నివేశాలు సమకూర్చారు. 45 ఏళ్ళ క్రితం “ఆచార్య దేవా… ఏమంటివి ఏమంటివి…” అంటూ యన్టీఆర్ సుయోధనునిగా ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో వల్లించిన సంభాషణలు ఈ నాటికీ తెలుగువారి మదిలో మారుమోగుతూనే ఉన్నాయి. అదే తీరున సంభాషణలు రూపొందించి, జూనియర్ తో ‘యమదొంగ’లో చెప్పించారు దర్శకుడు రాజమౌళి. పైగా, ఇందులో ఓ పాటలోనూ, ఓ సీన్ లోనూ యన్టీఆర్ ను గ్రాఫిక్స్ మాయాజాలంలో చూపించి, మాయ చేసి మత్తు చల్లారు రాజమౌళి. ఇంకేముంది జనం వెర్రెక్కి, కిర్రెక్కిపోయి ‘యమదొంగ’ను ఆదరించారు. 2007 ఆగస్టు 15న విడుదలైన ‘యమదొంగ’ ఘనవిజయం సాధించింది. అంటే అక్షరాలా ‘యమదొంగ’ సినిమా జనం ముందు నిలచి పదిహేను ఏళ్ళయిందన్న మాట! ఇప్పటికీ బుల్లితెరపైనా, యూ ట్యూబ్ లోనూ ‘యమదొంగ’ అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది.
‘యమ’ అన్న పదం తెలుగు సినిమాకు ‘యమ యమగా’ పనిచేసిందనే చెప్పాలి. యన్టీఆర్ ‘యమగోల’ ఆ రోజుల్లో ఓ సంచలనం కాగా, అదే తీరున సాగిన చిరంజీవి ‘యముడికి మొగుడు’ తరువాతి రోజుల్లో విజయవిహారం చేసింది. నవ్వుల రాజా ఆలీని హీరోగానూ నిలిపింది ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘యమలీల’. ఇలా ‘యమ’ అన్న పదం భలేగా పనిచేస్తుందనే కాబోలు రాజమౌళి తాము సొంతగా నిర్మించిన తొలి చిత్రానికి ‘యమదొంగ’ అని నామకరణం చేశారు. ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ పతాకంపై రాజమౌళి భార్య రమా రాజమౌళి సమర్పణలో ఆయన సమీపబంధువు ఊర్మిళ గుణ్ణం తో కలసి చెర్రీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టైటిల్ లోగోలో ప్రభాస్ విశ్వామిత్రునిగా కనిపించడం విశేషం!
Also Read
అంతకు ముందు జూ.యన్టీఆర్ తో రాజమౌళి రూపొందించిన ‘సింహాద్రి’ చిత్రం ఘనవిజయం సాధించి, పలు రికార్డులు నెలకొల్పింది. ఆ సెంటిమెంట్ తోనే కాబోలు, ఈ చిత్ర కథ సైతం నరసింహస్వామిని కీర్తిస్తూనే ఆరంభమవుతుంది. ఈ చిత్ర కథ యన్టీఆర్ ‘యమగోల’ కథను పోలి ఉంటుంది. కానీ, అందులో తర్కానికి తావిస్తూ హీరో కలలోనే యమలోకం, దేవేంద్రలోకం కనిపించినట్టు చూపించారు. ఇందులో తర్కం లేకుండానే తన మాయాజాలంలో మాయచేశారు రాజమౌళి. ఏ విద్యలోనైనా సూత్రాలు తు.చ. తప్పక నేర్వాలి, తరువాత వాటినే అధిగమించాలి. అప్పుడే సృజన అంటే ఏమిటో తేలుతుంది అన్నారు పెద్దలు. అదే తీరున సినిమా గ్రామర్ బోధించిన విజ్ఞులు వీలయినప్పుడు మన సినిమా గురించి జనం మాట్లాడుకోవాలంటే, అదే పనిగా ఏదైనా తప్పిదాన్ని కావాలనే చొప్పించాలనీ సెలవిచ్చారు. ‘యమదొంగ’లో రాజమౌళి కావాలనే తర్కం లేకుండా కేవలం వినోదం కోసమే ఈ చిత్రాన్ని నిర్మించారనిపిస్తుంది. అందువల్ల ఇందులోని లొసుగులు వెతకరాదు.
యన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘యమగోల’లోని “ఓలమ్మీ తిక్కరేగిందా…” పాటలోని మకుటాన్ని తీసుకొని భువనచంద్ర ఈ సినిమా కోసం మరో పాట సృష్టించారు. ఇదే పాటతో జూనియర్ యన్టీఆర్ తొలిసారి గాయకునిగానూ మారారు. జూనియర్ లో ఓ మంచి గాయకుడు ఉన్నాడని గ్రహించింది ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి. ఈ సినిమాకు భువనచంద్ర, అనంత్ శ్రీరామ్ పాటలు రాశారు. ఇందులోని “నువ్వు ముట్టుకుంటే…”, “రబ్బరు గాజులు…”, “నాచోరే నాచోరే…”, “నూనుగు మీసాలోడు…”, “యంగ్ యమా యంగ్ యమా…” అంటూ సాగే పాటలు కూడా అలరించాయి.
ఇందులోని ‘నాచోరే నాచోరే…’ పాట కోసం జూనియర్ వేసిన స్టెప్స్ గురించి ఈ నాటికీ జనం ప్రత్యేకంగా చర్చించుకుంటూనే ఉన్నారు. ఈ సినిమా ద్వారా జూ.యన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. కాగా, బెస్ట్ ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను, బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కు కమల్ కన్నన్ నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
ఈ చిత్రంలో జూనియర్ సరసన ప్రియమణి, మమతా మోహన్ దాస్ నటించారు. యముడిగా మోహన్ బాబు తనదైన శైలిలో అలరించారు. చిత్రగుప్తునిగా బ్రహ్మానందం మురిపించారు. ఇక ఇతర పాత్రధారులు సైతం తమ పాత్రలకు తగ్గ అభినయం ప్రదర్శించి, వినోదం పంచారు.
ఈ చిత్రం 200పైగా కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకొని అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్ హీరోగా నటించిన మూడో చిత్రమిది. అంతకు ముందు ‘స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి’ చిత్రాలతోనూ విజయం సాధించిన ఈ జోడీ ‘యమదొంగ’తో హ్యాట్రిక్ చూసింది.
యన్టీఆర్ నటించిన ‘గజదొంగ, ప్రేమసింహాసనం’ చిత్రాలలోని ఆర్కివ్ ఫుటేజీతో ఆయన ఈ సినిమాలో ఓ పాత్రలా కనిపించినట్టు గ్రాఫిక్స్ తో మాయాజాలం చేశారు. ముఖ్యంగా ‘యంగ్ యమా…’ పాటలో యన్టీఆర్ తో కలసి జూనియర్ స్టెప్స్ వేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజమౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత తాను తెరకెక్కించిన ‘మగధీర’లోనూ అదే మ్యాజిక్ చేశారు. ఇక ‘ఈగ’లో అయితే సగం సినిమాను గ్రాఫిక్స్ తోనే నడిపించారు. ఇలా జీఎఫ్ఎక్స్ తో మాయ చేస్తూనే మొన్నటి ‘ట్రిపుల్ ఆర్’ దాకా సాగారు రాజమౌళి. భవిష్యత్ లో రాజమౌళి నుండి ఇంకా ఎలాంటి అభూతకల్పనలు అబ్బుర పరస్తూ ఆకట్టుకుంటాయో కానీ, వాటికి మూలంగా నిలచిన చిత్రం ‘యమదొంగ’ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!