ప్రతి వారం పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నా, కొన్ని సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ వారంతంలో రెండు చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. అందులో ఒకటి కళ్యాణ్ దేవ్ నటించిన తెలుగు సినిమా ‘కిన్నెరసాని’ కాగా, మరొకటి మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ‘సీబీఐ 5’. ఇందులో ‘కిన్నెరసాని’ జూన్ 10న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంటే, ‘సీబీఐ 5: ద బ్రెయిన్’ నెట్ ఫ్లిక్స్ లో 12వ తేదీ రాబోతోంది.
ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు కూడా ఆరు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ గురించి. కరోనా కాలంలో నాని నటించిన ‘వి’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే గత యేడాది డిసెంబర్ 25న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించినా, కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘అంటే సుందరానికీ…’మూవీపై నాని, అతని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మలయాళ నాయిక నజ్రియా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
సంపత్ కుమార్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘సురాపానం’ మూవీ 10వ తేదీ జనం ముందుకు వస్తోంది. మట్ట మధు యాదవ్ నిర్మించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ కామెడీ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించింది. మరో స్ట్రయిట్ సినిమా ‘జరిగిన కథ’తో పాటు ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘యు ఆర్ మై హీరో’ మూవీని 10వ తేదీన రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇక రక్షిత్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘777 చార్లీ’, ఆంగ్ల అనువాద చిత్రం ‘జురాసిక్ వరల్డ్ డొమీనియన్’ కూడా శుక్రవారమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఏకంగా ఎనిమిది సినిమాలు ఈ వీకెండ్ లో జనం ముందుకు వస్తున్నట్టు లెక్క