నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి.
కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతూ ఆపేసి, హైదరాబాద్ చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. తరువాత సొంతగా ‘అతనొక్కడే’ సబ్జెక్ట్ తయారు చేసుకొని, నందమూరి కళ్యాణ్ రామ్ కు వినిపించారు. కళ్యాణ్ తానే నిర్మాతగా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ నటించారు. ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి టేకింగ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ గా ‘అతనొక్కడే’ నిలచింది. మొదటి సినిమాతోనే విజయం సాధించిన సురేందర్ కు మంచి అవకాశాలు లభించాయి. రెండవ చిత్రమే జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. జూనియర్ యన్టీఆర్ తో ‘అశోక్’, తరువాత మహేశ్ బాబుతో ‘అతిథి’ రూపొందించారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ తెరకెక్కించిన ‘కిక్’ మంచి విజయం సాధించింది. మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ రూపొందించారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన ‘రేసు గుర్రం’ బంపర్ హిట్ అయింది.
రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రాన్ని తన తొలి నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ ఆధారంగా రామ్ చరణ్ తో ‘ధ్రువ’ రూపొందించారు సురేందర్. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం కుదిరింది. దాంతో తన తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు రామ్ చరణ్. ‘సైరా…’ రూపకల్పనలో దర్శకునిగా సురేందర్ మంచి మార్కులే సంపాదించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఏ తీరున సురేందర్ రెడ్డి జనాన్ని అలరిస్తారో చూడాలి.