ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మైఖెల్’ చిత్రంలోనూ గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్ విడుదల చేసి తెలిపారు.
‘మైఖెల్’ చిత్రాన్ని రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పుస్కర్ రామ్ మోహన్, భరత్ చౌదరి భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నారాయణ దాస్ కె నారంగ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమంటే… ‘మైఖెల్’లో గౌతమ్ మీనన్ పోషిస్తోంది ప్రతినాయకుడి పాత్ర. ఆ క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీని దర్శకుడు సోమవారం విడుదల చేసిన పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడు.