భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో గొప్ప చిత్రాలు తీశారాయన. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత పొందింది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్ కోర్టులో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో నిజమైన లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన పాటతో పాటు రాజాజీ రాసిన మరో పాటను వాణీ జయరామ్ ఆలపించారు. తమిళంలో తొలి నియో రియలిస్టిక్ సినిమా ఇదే. అప్పటి సంగతులను సింగీతం శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ‘ఈ సినిమా కోసం రాజాజీ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన అనుమతి తీసుకోవడం మరువలేని అనుభూతి. సినిమా విడుదలైన కొన్నాళ్ల తర్వాత నెగెటివ్ డ్యామేజ్ అయ్యిందనే విషయం తెలిసి షాక్ అయ్యాను. అదృష్టవశాత్తూ మంచి ప్రింట్ ఒకటి పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ దగ్గర లభించింది.
భారతీయ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఐదు వందల క్లాసిక్ సినిమాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. అందులో మా ఈ సినిమా ఒకటి. విడుదలైనప్పుడు అప్పటి ప్రేక్షకులు ఎంత ఫ్రెష్గా ఫీల్ ఫీలయ్యారో ఇప్పటి ప్రేక్షకులు కూడా అంతే ఫ్రెష్గా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను’ అని అంటున్నారు. లక్ష్మి, వై.జి. మహేంద్ర నటించిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి వీణా విద్వాన్ చిట్టిబాబు సంగీతం అందించారు. రవి వర్మ, కారైకుడి నారాయణ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.