గతంలో బాలా రూపొందించిన వాడు-వీడు సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో హీరోయిన్గా నటించిన మృణాళిని రవి ‘ఎనిమీ’లో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. డి. రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.
Read Also : “రాపో19” కోసం పవర్ ఫుల్ విలన్ ?
సోమవారం ‘ఎనిమీ’ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేశారు. ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేయారు. షూటింగ్ స్పాట్ లో టీమ్ తో దిగిన సెల్ఫీని విశాల్ పోస్ట్ చేస్తూ, లవ్లీ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని, త్వరలో టీజర్ విడుదల కాబోతోందని అన్నాడు. విశాల్ నటించిన ‘చక్ర’ సినిమా ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైంది కానీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేకపోయింది. అలానే ఆర్య నటించిన ‘టెడ్డీ’ చిత్రం మార్చిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ చిత్రానికీ పెద్దంత స్పందన లభించలేదు. దాంతో వీరిద్దరి అభిమానులు ఇప్పుడు ‘ఎనిమీ’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మల్టీస్టారర్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.