తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సైలెంట్గా సాగిన థియేటర్ల నిర్వహణ వ్యవహారం.. ఇప్పుడు కలెక్షన్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి రచ్చకెక్కింది. మల్టీప్లెక్స్ల హవా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమ మనుగడ కోసం ఒక కీలకమైన డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అదే “పర్సంటేజ్ సిస్టమ్”. ప్రస్తుతం నడుస్తున్న సాంప్రదాయ రెంట్ విధానం వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో వాటా కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు గళమెత్తారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఇంతలా పట్టుబట్టడానికి కారణం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆదాయ పంపకాల వ్యత్యాసాలే. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ₹1 కోటి రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని అనుకుంటే.. ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింగిల్ స్క్రీన్ (ఫిక్స్డ్ రెంట్ విధానం)లో ₹7 లక్షలు అద్దె మాత్రమే వారికి ఉంటుంది. మిగిలిన ₹93 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి.
మల్టీప్లెక్స్ ల పర్సంటేజ్ విధానం ప్రకరం ₹45 లక్షలు మల్టీప్లెక్స్ ఉంచుకుని ₹55 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి. ఈ గణాంకాలను గమనిస్తే అసలు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒకే రకమైన బిజినెస్ జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్స్ యజమానులకు భారీగా లాభాలు దక్కుతుంటే.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు మాత్రం కేవలం నామమాత్రపు ఫిక్స్డ్ రెంట్లు మాత్రమే మిగులుతున్నాయి. సినిమా సూపర్హిట్ అయి కోట్లు కురిపించినా, సింగిల్ స్క్రీన్ ఓనర్కు వచ్చే అద్దె రూపాయి కూడా పెరగదు. అదే సినిమా ఫ్లాప్ అయితే, కనీస నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) కూడా రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వివక్షకు స్వస్తి పలికి, సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అదే 60:40 రేషియో.ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. థియేటర్కు వచ్చే కలెక్షన్ల షేర్లో 60% వాటా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, మిగిలిన 40% వాటా థియేటర్ యజమానికి దక్కుతుంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేసేందుకు చాలా పెద్ద సినిమాల నిర్మాతలు సిద్దంగా లేరు.
