టాలీవుడ్కు చెందిన రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు నిర్దేశించిన టాక్స్ మొత్తాన్ని కాకుండా, చాలా తక్కువ మొత్తంలో టాక్స్ కడుతున్నారంటూ జీహెచ్ఎంసీ (GHMC) తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామానాయుడు స్టూడియోస్ ను నిర్వహిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని పేర్కొన్నారు. ప్రాపర్టీ టాక్స్, అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు రెండూ జీహెచ్ఎంసీ కలెక్ట్ చేస్తుంది కాబట్టి, జీహెచ్ఎంసీతో తాము ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ రికార్డ్స్ ప్రకారం ఎప్పటికప్పుడు తమ ప్రాపర్టీ టాక్స్ విలువ వేసి కట్టించుకునేవారని, 68,276 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా కోసం కొన్ని ఏళ్ల నుంచి తాము ప్రాపర్టీ టాక్స్ కడుతున్నామని పేర్కొన్నారు.
Also Read :Varanasi: మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన కీరవాణి
ఈ బిల్డప్ ఏరియా విషయంలో ఎప్పుడూ ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఫీజుని సంవత్సరానికి ₹7,614 రూపాయలు ఉండాల్సింది, ₹2,73,014 (రెండు లక్షల డెబ్బై మూడు వేల పద్నాలుగు) రూపాయలకు పెంచింది. అయితే, ఇప్పటికే దాన్ని కట్టేశాం. అయినా సరే, ఒకేసారి అంతగా పెంచడం కరెక్ట్ కాదని తాము అభిప్రాయపడుతున్నాం. జీహెచ్ఎంసీ ఈ విషయాన్ని మరోసారి పరిశీలిస్తుందని ఆశిస్తున్నాం. బిల్డప్ ఏరియా విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఈ సందర్భంగా మరోసారి రామానాయుడు స్టూడియో సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం కాదని పేర్కొంది. జీహెచ్ఎంసీకి కావలసినట్టుగా రామానాయుడు స్టూడియోస్ అన్ని చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.