ప్రముఖ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనంద ప్రసాద్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో భవ్య భవన సముదాయ ప్రాంగణంలో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించింది. అలానే హైదరాబాద్ నుండి తిరుమలకు ఆనంద్ ప్రసాద్ కాలినడకన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2015లో టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ హాస్పిటల్ కు వి. ఆనంద ప్రసాద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాగుతున్న నిత్యాన్నదానానికి తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని బుధవారం అందించారు. తిరుమలలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసి, కోటి రూపాయల చెక్కును తన భార్య కృష్ణకుమారితో కలిసి ఆనంద ప్రసాద్ అందచేశారు.