ప్రధాని మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోని నటుడు ప్రకాష్ రాజ్ జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి విషయంలో మౌనం పాటించారు. ఆయన స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించిన క్రమంలో ఒక కాశ్మీరీ వ్యక్తి సందేశం అంటూ ఒక మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్పై జరిగిన దాడి అని ఆయన షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రతీ కశ్మీరీ గుండె ముక్కలైందని, ఈ మారణకాండపై మాటలు రావడం లేదని.. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్ధం ఆవరించిన రోజు. ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు, ప్రతీ కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అందుకే బరువైన హృదయంతో ఇది రాస్తున్నా, మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు. ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితి ఎదుర్కొన్నారు, ఈ ఆటవిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు. కశ్మీర్పై దాడి.’ అని అందులో పేర్కొన్నారు.
Pak Link: పహల్గాం ఎటాక్.. పాకిస్తాన్ హస్తం..!!
‘మన విశ్వాసాన్ని దెబ్బ తీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణం, ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది, ఇది నిజంగా భయంకరమైన చర్య అని అన్నారు. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరీలు మౌనంగా ఉండకూడదు, మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం, దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. మీరు (ఉగ్రవాదులు) ఏం ఆశించి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు, మీ దుశ్చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది, ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చింది.’ అని పేర్కొన్నారు. కశ్మీర్ ఆట స్థలం కాదని.. యుద్ధ క్షేత్రం అంతకన్నా కాదని సదరు కాశ్మీరీ పేర్కొన్నారు.