యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న రొమాంటిక్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఇప్పటివరకు పోస్టర్లు, ఫిబ్రవరి 14న గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్
పేరుతో ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ తరువాత ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ నుంచి అప్డేట్ రాకపోవడంతో అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆందోళనకు గురి చేసేలా ‘రాధేశ్యామ్’ రీషూట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘రాధేశ్యామ్’లో కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఆ సన్నివేశాలకు కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ సూచిస్తూ రీషూట్ చేయమని దర్శకుడు రాధాకృష్ణకు చెప్పారట ప్రభాస్. అయితే ఇప్పటికే ఓ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉండగా… అది పూర్తయ్యాక రీషూట్ ఉండే అవకాశం ఉందట. ఈ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్లో రెండేళ్ళను అంకితం చేశాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ‘రాధేశ్యామ్’లో మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.