మహిళలు తమలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నపుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలరు అని బాలీవుడ్ తార వామికా గబ్బి అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన మిస్ ఇండియా యూకే ప్రాజెక్టును నగరంలోని బంజారాహిల్స్ తాజ్ డెక్కన్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిస్ ఇండియా యూకే లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమలో నైపుణ్యం గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు అన్నారు. ప్రాజెక్టు నిర్వాహకులు స్టార్డస్ట్ పేజెంట్స్ ప్రతినిధులు సత్య, క్రాంతి, సాయి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Karavali : ఇదేం పైత్యం.. కరావళిని కరిపిస్తారా?
ఈ ప్రాజెక్టు ఏడాది పొడుగునా సాగుతుందని, ఇందులో భాగంగా తొలుత మిస్ తెలుగు యూకే, మిస్ తమిళ యూకే, మిస్ కన్నడ యూకే, మిస్ మలయాళం యూకే పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు నగదు బహుమతులతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని వారు తెలిపారు. త్వరలోనే ఈ మిస్ ఇండియా యూకే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్తో పాటు ప్రమోషన్ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ పేజెంట్లో అందాల పోటీలే కాకుండా దక్షిణ భారతీయుల సాంప్రదాయాలను ప్రపంచ వేదికకు పరిచయం చేసేందుకు ఈ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.