Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, కథనం, విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా డైలాగ్స్పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా వివాదాలు చెలరేగడంతో చిత్రబృందం కొన్ని డైలాగ్స్ను మార్చాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో ఈ సినిమాపై వచ్చిన విమర్శలను సమర్థించిన మనోజ్ ముంతషీర్.. ఇప్పుడు బహిరంగంగా తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మనోజ్ ముంతషీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “‘ఆదిపురుష్’ సినిమా నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ సినిమా రిలీజ్ తర్వాత దానిని సమర్థించడం అంతకంటే పెద్ద తప్పు” అని అన్నారు. ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు. సినిమా చుట్టూ జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. ఆ సినిమా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, ఈ దేశ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ భావోద్వేగంగా స్పందించారు. ప్రజల మనోభావాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని, ఆ విషయంలో జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నానని తెలిపారు. తాజా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

