ఇళయరాజా గత 40 సంవత్సరాలకు పైగా తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సంగీతానికి ఉన్న ఆదరణ నేటికీ తగ్గలేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్క యూట్యూబ్ మ్యూజిక్లోనే నెలకు 400 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆయన పాటలు అలరిస్తున్నాయి. అయితే తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడానికి ఆయన ఎన్నడూ అంగీకరించరు. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన ‘కుర్తు మచ్చన్’ పాటను ఆయన అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తన పాటను అనధికారికంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరపు వారు కోర్టులో కేసు దాఖలు చేశారు.
Also Read :CM Revanth Reddy : రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి.. సీఎం కీలక ఆదేశాలు
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎన్. సెంథిల్ కుమార్, ‘డ్యూడ్’ చిత్రాన్ని ప్రదర్శించడం కొనసాగించవచ్చని, అయితే కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి ప్రత్యేక కేసు దాఖలు చేసుకోవచ్చని సూచించారు. ఏదేమైనా, ఈ చిత్రంలో తమ సంగీతం యొక్క కాపీరైట్ కచ్చితంగా ఉల్లంఘించబడిందని ఇళయరాజా తరపు వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇళయరాజా తన పాటల హక్కులు మరియు రాయల్టీల విషయంలో ఎల్లప్పుడూ చాలా దృఢంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇది కేవలం ‘డ్యూడ్’ సినిమాకు మాత్రమే పరిమితం కాదు. గతంలో కూడా ఆయన అనేక ఇతర చిత్ర నిర్మాణ సంస్థలు, సంగీత సంస్థలతో తన కాపీరైట్ల కోసం పోరాడారు. సోనీ మ్యూజిక్, ఎకో రికార్డ్స్, యూనివర్సల్ రికార్డ్స్ వంటి అనేక ప్రఖ్యాత సంగీత సంస్థలపై కూడా ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు గతంలో కేసులు దాఖలు చేశారు.