బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరీంగ్ కేసులో ఈనెల 8న ఢిల్లీలో… తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది. చంద్రశేఖర్.. జాక్వెలిన్కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి…ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో జాక్వెలిన్పై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
తాజాగా మరోసారి విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు. మరోవైపు…జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదివారం దుబాయి వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్టు అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెపై ఈడీ లుక్అవుట్ నోటీసులు ఉండటంతో విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఐతే…జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్తో కలిసి ఉన్న ఫొటోలు కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫొటోలో జాక్వెలిన్, సుకేష్ చంద్రశేఖర్ను ముద్దు పెట్టుకుంది. జాక్వెలిన్ ముద్దు పెట్టుకున్నప్పుడు సుకేష్ సెల్ఫీ క్లిక్ మనిపించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్లో మధ్యంతర బెయిల్పై సుకేష్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక మొత్తానికి…మళ్లీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ సమన్లు జారీ చేయటం సంచలనంగా మారింది.