మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 35 ఏళ్ల సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. చిరంజీవి, అశ్వనీదత్, రాఘవేంద్రరావు ఈ సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి 35 ఏళ్లా? షూటింగ్ రోజులు ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయి. శ్రీదేవితో రెండు సినిమాల తర్వాత ఇది చేశాం, కానీ ఇదే మొదటిదన్నట్లు ప్రేక్షకులు ఆదరించారు. రాఘవేంద్రరావు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆయన్ను తీసుకోవద్దని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నేనూ, అశ్వనీదత్ ఆయనతోనే చేయాలని, లేకపోతే సినిమానే వద్దని నిర్ణయించాం. ఫలితాలతో టాలెంట్ను అంచనా వేయకూడదు. టెక్నీషియన్గా రాఘవేంద్రరావు ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు, అందరి సలహాలతో చిత్రాన్ని చెక్కారు.
Read More:Raghavendra Rao: మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్.. పని అయిపోయిందనుకున్నారు
27 మంది రచయితలు పనిచేశారు, నేనూ 35 రోజులు రైటింగ్ విభాగంలో పాల్గొన్నాను. ఇళయరాజా పాటలను మూడు-నాలుగు గంటల్లో కంపోజ్ చేశారు. ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాట ఉదయం ప్రారంభించి మధ్యాహ్నానికి పూర్తయింది, ఒకటిన్నర రోజుల్లో షూట్ చేశాం. కథను మొదట చంద్రమండలంలో అనుకున్నాం, కానీ మానస సరోవరం నమ్మదగినదని ఫిక్స్ చేశాం. రాఘవేంద్రరావు విజయ వాహినీ స్టూడియోలో మానస సరోవరాన్ని అద్భుతంగా సృష్టించారు. ఈ రీ-రిలీజ్లో శ్రీదేవిని తలచుకుంటూ ఆమెకు అంకితం చేస్తున్నాం. ‘దినక్కుతా’ పాట షూటింగ్ సమయంలో నాకు తీవ్ర జ్వరం వచ్చింది. నిలబడే శక్తి లేకపోయినా, రిహర్సల్స్ చేయలేకపోయినా షూట్ పూర్తి చేశాను. గుమ్మడి కాయ కొట్టినట్లు తెలిసి కుప్పకూలాను. విజయ హాస్పిటల్లో చేర్చగా, రెండు రోజుల తర్వాత మలేరియా అని తెలిసింది. రిలీజ్ డేట్ మిస్ కాకూడదని, నిర్మాతకు నష్టం రాకూడదని కష్టపడి షూట్ చేశాను. నిర్మాతలను గౌరవించడం ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నాను. దర్శక, నిర్మాతలను తల్లిదండ్రుల్లా గౌరవిస్తాను.
Read More:Youtube Delivery: యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రియురాలికి డెలివరీ చేసిన ప్రియుడు..!
విన్సెంట్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా మలిచారు. భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి వెళ్లే సన్నివేశాన్ని ఒక రోజులో షూట్ చేశారు. ఇప్పుడు అలాంటి షాట్కు కోట్లు ఖర్చవుతాయి. ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాటలో ప్రభుదేవా, 16 ఏళ్ల వయసులోనే తన ప్రతిభ చూపించాడు. సుందరం మాస్టర్ భయపడినా, నేను ప్రభుదేవాకు పాటలు ఇచ్చాను. రింగును చేప మింగిన తర్వాత ఏమైందనే ప్రశ్నకు అప్పుడే ఎండ్ కార్డులో హింట్ ఇచ్చి ఉంటే సీక్వెల్ వచ్చేది. ఇప్పుడు సీక్వెల్ తీస్తే రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని కోరుకుంటున్నా. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తే బాగుంటుంది. అశ్వనీదత్ వారసులు దీన్ని నిర్మిస్తారని (నవ్వుతూ) అనుకుంటున్నా. ప్రస్తుత తరం ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. ఈ రీ-రిలీజ్ను కుటుంబంతో కలిసి చూడండి, అందరూ ఆనందిస్తారు” అని అన్నారు.