ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగాల సమగ్రాభివృద్ధికి నూతన పాలకవర్గం నడుం బిగించింది. ఏపీ ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFTDC) నూతన పాలకవర్గం యొక్క తొలి బోర్డు సమావేశం విజయవాడలోని ఫార్చూన్ మురళి పార్క్ హోటల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమ పురోగతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తొలి సమావేశంలో ప్రధానంగా గతంలో ప్రకటించిన నంది అవార్డులతో పాటు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివిధ అంశాలు, విధివిధానాలు మరియు సూచనలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో సినిమా షూటింగులకు అనుకూల వాతావరణం కల్పించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతులు మరియు ప్రోత్సాహకాలు అందించడంపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (రూట్ మ్యాప్) సిద్ధం చేయనున్నారు. ఏపీలో చిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ.. కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు అండగా నిలిచేలా కార్పొరేషన్ అడుగులు పడబోతున్నట్లు బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, దర్శకుడు వి. సముద్రతో పాటు వై. ఝాన్సీ, చదలవాడ శ్రీనివాసరావు, కందిమళ్ల సాంబశివరావు, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణా రెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ సాహు లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ముడావత్ శ్రీనివాస్ నాయక్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

