Rashmika Calls Herself Telangana Kodalu at Gaddar Awards 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ పురస్కారాలు వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేయడం విశేషం. తెలుగు సినిమా రంగానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ఈ అవార్డులు గతంలో పలు కారణాలతో దాదాపు పద్నాలుగేళ్ల పాటు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది నుంచి మళ్లీ ఈ పురస్కారాలను ప్రారంభించిన ప్రభుత్వం.. సినీ రంగంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉత్తమ చిత్రాల నిర్మాణానికి ప్రేరణనిస్తోంది. ఈసారి కూడా ఉగాది సందర్భంగా గద్దర్ సినీ అవార్డ్స్ 2025 వేడుకను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్న ఆమె స్టేజ్పైనే భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం నాకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… ‘గతంలో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా. నా నటనపై విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నా నటనని మెచ్చి ఈ పురస్కారం ఇచ్చింది. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది’ అని చెప్పారు.
Also Read: AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!
వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. ‘ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు తెలంగాణ కోడలిగా మీ ముందుకు వచ్చాను. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వెంటనే ప్రేక్షకుల్లో హర్షధ్వానాలు మార్మోగాయి. రష్మిక ప్రసంగం జరుగుతుండగా నటుడు విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సన్నివేశం వేడుకకు మరింత హైలైట్గా నిలిచింది. మొత్తం మీద గద్దర్ సినీ అవార్డ్స్ వేడుక సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఆనందోత్సాహాలతో కొనసాగి తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఉత్సాహాన్ని నింపింది. రష్మిక ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.