చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. “లెజెండరీ నిర్మాత ఆర్.బి. చౌదరి గారి ఆకస్మిక దుర్మరణం మనసుని కలిచివేసింది. ఆయనతో నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. నా చిత్రం “గాడ్ ఫాదర్” కోసం సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా ఆయనతో పని చేసే అవకాశం దక్కింది. ఆర్.బి. చౌదరి గారు ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్లను తీర్చిదిద్దుతూ, అనేక అద్భుత కథలను తెరపైకి తీసుకొచ్చిన గొప్ప నిర్మాత. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వర్ణనాతీతం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను”. అని అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
