JD Laxminarayana: రమేశ్ చెప్పాల దర్శకత్వంలో బత్తిని కీర్తి లతా గౌడ్ నిర్మించిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ చెప్పాల ఓ విశేషాన్ని తెలిపారు. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వి. వి. లక్ష్మీనారాయణ ఈ చిత్రంలో నటించారని చెప్పారు. అలానే ఆయనతో పాటే తొలిసారి వెండితెరపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అద్దంకి దయాకర్ కూడా నటించారని అన్నారు.
గతంలో స్వయంగా రామ్ గోపాల్ వర్మ అడిగినా నటించడానికి అంగీకరించని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని రమేశ్ తెలిపారు. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రాన్ని ఇటీవల జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించామని, దీనిని నియో రియలిజమ్ ఉట్టిపడేలా స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ లో నిర్మించామని అన్నారు. కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులను నటింపజేశామని, వాస్తవికత కళ్ళ ముందుంచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని చెప్పారు.