Bhavani Ward: ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ సినిమా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. దెయ్యాలు, చేతబడులు ఇలాంటి కథాంశాలతో ప్రేక్షకులను భయపెడుతూ దర్శకులు హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న చిత్రం భవానీ వార్డ్. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ భవానీ వార్డ్. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను సోమవారం నిర్వహించారు. ఫస్ట్ లుక్ సైతం భయపెట్టేలానే కనిపిస్తుంది. హ్ హాస్పిటల్ వార్డ్ లో వీల్ చైర్ లో ఒక అమ్మాయి కూర్చొని ఉండగా.. వెనుక ఒక నీడ నిలబడి ఉన్నట్లు చూపించారు.
ఇక ఈవెంట్ లో దర్శకుడు నరసింహ మాట్లాడుతూ.. “నేను చెప్పిన కథను ఒప్పుకుని నటించిన గాయత్రి గుప్తా గారికి థాంక్స్. ఆమె ఎంతగానో సహకరించారు. హీరో గారు అధ్బుతంగా నటించారు. నటీనటుల సహకారంతో ఈ సినిమాను బాగా తీశాను. నిర్మాత కళ్యాణ్, చంద్రకాంత్ గార్ల సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ నచ్చేలా సినిమాను తీశాను. మరీ ముఖ్యంగా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది” అని అన్నారు. నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. “నరసింహ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని నిర్మించాను. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. “సీనియర్ అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ చిత్రాన్ని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెట్స్పై ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన చాలా మంచి దర్శకులు. ఈ చిత్రం టెక్నీకల్గా బాగుంటుంది. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్” అని చెప్పుకొచ్చింది.హీరో గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏ సినిమా అయినా మీడియా సహకారంతోనే ముందుకు వెళ్తుంది. మా సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. పీఆర్వో సాయి సతీష్ గారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అని తెలిపాడు. పూజా కేంద్రే మాట్లాడుతూ.. “నాకు తెలుగు రాదు. మరాఠా నుంచి వచ్చాను. ఈ చిత్రంతో నా గురించి మీకు తెలుస్తుంది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని తెలిపింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.