ఈ సంవత్సరం ప్రారంభంలో బోల్డ్ కంటెంట్, విభిన్న కథతో సంచలనంగా నిలిచిన తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దర్శకుడు వర్ష భరత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరోయిన్ అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా, సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి తమిళ్లో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. సెప్టెంబర్లో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో సౌత్ ఆడియెన్స్కు మరింత చేరువ కానుంది.
Also Read : Bigg Boss 9: బంధాలకి ఎండ్ కార్డ్ వేసిన భరణి.. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే?
‘బ్యాడ్ గర్ల్’ కథ రమ్య అనే యువతి చుట్టూ తిరుగుతుంది. సమాజం పెట్టిన అంచనాలు, నిబంధనల మధ్య తన స్వేచ్ఛను, తన వ్యక్తిత్వాన్ని కనుగొనాలనుకునే ఆ అమ్మాయి ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. సమకాలీన యువత ఆలోచనలను నిజాయితీగా చూపినందుకు విమర్శకులు ఈ చిత్రానికి మంచి ప్రశంసలు కురిపించారు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ పొందిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వస్తోంది. హోమ్ వ్యూయర్స్ ఈ బోల్డ్ డ్రామాకు ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది. సమాజపు ఆంక్షలపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ కథ మళ్ళీ కొత్త చర్చలకు నాంది పలుకుతుందా? వేచి చూడాలి.