విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు ఊహించని వినోద కానుకను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్ కాంబినేషన్లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘ఏఏఏ (AAA) సినిమాస్’ మల్టీప్లెక్స్ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. వైజాగ్ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుకకు అభిమానుల కోలాహలం, హర్షధ్వానాల మధ్య ఐకాన్ స్టార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
సభను ఉద్దేశించి మాట్లాడుతూ బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విశాఖపట్నం తనకు ఎంతగానో ఇష్టమైన నగరమని, తన సినీ ప్రస్థానంతో ఈ నగరానికి విడదీయరాని బంధం ఉందని స్పష్టం చేశారు. “వైజాగ్ నాకు ఎంతో ప్రత్యేకమైన ఊరు. నా తొలి చిత్రం ‘గంగోత్రి’ షూటింగ్ సమయంలో ఈ వీధుల్లో నడిచినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టేవాళ్ళు కూడా కాదు. కానీ ఈ రోజు ఇక్కడ అడుగుపెడితే అభిమానుల ఆప్యాయతతో నడవలేనంత ప్రేమ లభిస్తోంది. ఆ రోజుల్లోనే ఈ నగరంలో ఒక భారీ మాల్ వస్తుందని, అందులో నా స్వంత ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్!” అని బన్నీ వ్యాఖ్యానించారు.
మాల్స్ ప్రాధాన్యతను వివరిస్తూ, అవి కేవలం వాణిజ్య సముదాయాలు కావని, నగర సంస్కృతిలో భాగమని అభిప్రాయపడ్డారు. చెన్నైలో తను పెరిగిన రోజుల్లో మాల్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, వైజాగ్ ప్రజలకు, కుటుంబాలకు, యువతకు ఈ ఇన్ ఆర్బిట్ మాల్ ఎన్నో మంచి జ్ఞాపకాలను అందిస్తుందని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలను పంచుకుంటూ, భారతదేశంలో ఎక్కడా లేని వినూత్న టెక్నాలజీని వైజాగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని గర్వంగా ప్రకటించారు. ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీన్ కు ‘వైల్డ్ ఫైర్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ మల్టీప్లెక్స్ లోని ప్రతి స్క్రీన్నూ పర్సనల్ కేర్ తీసుకొని డిజైన్ చేశామని, ఇది వైజాగ్ ప్రజలకు తాము ఇచ్చే ప్రత్యేక అంకితమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా అభిమానుల కేరింతలు, ఉత్సాహాన్ని చూసి “కొంచెం రిలాక్స్ అవ్వండి డాడీ” అంటూ తన శైలిలో చమత్కరిస్తూ వాతావరణాన్ని మరింత సరదాగా మార్చేశారు.
ఈ మల్టీప్లెక్స్ కేవలం సినిమాలు చూసే థియేటర్ లాగా కాకుండా, ప్రతీ ఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతులను అందించే వేదికగా నిలుస్తుందని బన్నీ విశ్వాసం వ్యక్తం చేశారు. వైజాగ్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ, తనపై చూపుతున్న నిరంతర ఆప్యాయతకు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

