Karuppu : కరుప్పు హిట్.. కీ టెక్నీషియన్స్’కి కార్లు కొనిపెట్టిన సూర్య

Karuppu

Karuppu

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సూర్య తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సినిమా భారీ విజయం సాధించినప్పుడు దర్శకులకు, ప్రధాన నటీనటులకు నిర్మాతలు లేదా హీరోలు ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, సూర్య మాత్రం ఇండస్ట్రీలో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. తెర వెనుక నిశ్శబ్దంగా శ్రమించే ముగ్గురు టెక్నీషియన్లకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.

‘కరుప్పు’ ఘన విజయానికి కారణమైన ముగ్గురు యువ టెక్నీషియన్ల ప్రతిభను గుర్తిస్తూ, సూర్య వారికి ఒక్కొక్కరికీ సుమారు 30 లక్షల రూపాయల విలువైన మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ కార్లను సొంత ఖర్చుతో బహుమతిగా అందించారు. సూర్య నుండి ఈ లగ్జరీ గిఫ్ట్ అందుకున్న వారిలో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సినిమాటోగ్రాఫర్ విష్ణు, ఎడిటర్ కలైవానన్ ఉన్నారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాని ఎడిటర్ కలైవానన్‌ను గుర్తించి, ఆయనకు ఈ స్థాయి గౌరవం అందించడం పట్ల అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాల నుండి సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్య చేసిన ఈ గొప్ప పనిపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హృదయపూర్వక పోస్ట్ పెట్టారు. “ఒక సినిమా హిట్ అయ్యాక నటీనటులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు గిఫ్ట్‌లు ఇవ్వడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ, తెర వెనుక ఉండే ఒక ఎడిటర్‌ను గుర్తించి కార్ బహుమతిగా ఇవ్వడం తమిళ సినిమా చరిత్రలోనే చాలా అరుదు. ఆ విధంగా సూర్య ఒక అద్భుతమైన కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు”* అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

×
×
Ad